Thursday, May 19, 2011

కుక్క కరిస్తే...!

రాష్ట్రంలో కుక్కకాటు మరణాలు ఇటీవల ఆందోళన కలిగిస్తున్నాయి. రోజుకు కనీసం ఒకరైనా రేబిస్ వ్యాధి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. రేబిస్ వ్యాధికి ఇప్పటికీ చికిత్స అందుబాటులో లేదు. వ్యాధి సోకకముందు జాగ్రత్తలు తీసుకోవడం మినహా చేసేదేమీ లేదు. ఈ వ్యాధి సోకి బతికి బయటపడిన రోగులు ఇప్పటివరకూ దేశంలో ఎక్కడాలేరని గణాంకాలు చెబుతున్నాయి. అందువల్ల కుక్క కరిచినట్లయితే.. పెంపుడు కుక్క అయినా సరే తప్పనిసరిగా కొన్ని జాగ్త్రత్తలు పాటించాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 


* రేబిస్ సోకితే చికిత్స లేదు ... నివారణ ఒక్కటే మార్గం
* కుక్క కరచిన వెంటనే గాయాన్ని సబ్బుతో గానీ, డెటాల్‌తో గానీ బాగా శుభ్రం చేయాలి. ఎక్కువసార్లు శుభ్రం చేయడం మంచిది.
* ఆ వెంటనే ప్రొఫలాక్సిస్ అనే ఇంజెక్షన్‌ను ఇవ్వాలి. ఇది మూడు దఫాలుగా ఇస్తారు.
* సాధారణ కుక్కలకు మాత్రమే ఈ ఇంజక్షన్ వర్తిస్తుంది. రేబిస్ వ్యాధి ఉన్న కుక్కలూ, పిచ్చి కుక్కలూ కరిస్తే ఈ ఇంజెక్షన్ పనిచేయదు.
* కుక్క కరచిన భాగంలో కట్లు వేయడం గానీ, దూది పెట్టడం గానీ చేయకూడదు. గాయానికి గాలి తగిలేలా ఉంచడం వల్ల రేబిస్ వృద్ధి చెందకుండా ఉంటుంది.
* రేబిస్ వ్యాధి ఉన్న కుక్క కరిచినప్పుడు ఐదు డోస్‌ల ఏఆర్‌వీ (యాంటీ రేబిస్ వ్యాక్సిన్) తీసుకోవాల్సిందే.
* కరచిన రోజు, తర్వాత 7వ రోజు, 14 రోజు, 28వ రోజు తీసుకోవాలి. చివరగా 90 రోజులకు బూస్టర్ డోస్ వాడా లి. ఇంట్రా డెర్మల్ (చర్మానికి), ఇంట్రా మస్క్యులర్ (కండరాలకు) రెండు విధాలుగా ఇంజెక్షన్ చేయించుకోవచ్చు.
* రేబిస్ ఉన్న కుక్క కరిస్తే వ్యాధి ఏడాదిలోగా ఎప్పుడైనా సోకవచ్చు. అందుకే ఏఆర్‌వీ తప్పకుండా వాడాలి.
* ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలకు (పెట్ డాగ్స్) తప్పనిసరిగా బీపీఎల్ ఇనాక్టివేటెడ్ బ్రెయిన్ టిష్యూ వ్యాక్సిన్ వేయించాలి. 5 ఎంఎల్ సింగిల్ డోస్ సరిపోతుంది.
* మెడ, ఛాతీ, ముఖం తదితర భాగాల్లో కుక్క కరిస్తే వెంటనే ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాళ్లు, చేతులపై కరిస్తే మొదటిరోజు నుంచి నాలుగేళ్లలోపు ఎప్పుడైనా రేబిస్ సోకే ప్రమాదముంది.
* కుక్క పిచ్చిదా, రేబిస్ వ్యాధి ఉన్నదా అని తేల్చుకోవాలి. వ్యాధి ఉన్న కుక్క అయితే పదిరోజులకు మించి బతకదు.
* రేబిస్ వ్యాధి లైజా అనే వైరస్ నుంచి వస్తుంది.
* ఈ వ్యాధి గబ్బిలం కరచినా (బాట్ రేబిస్) వచ్చే అవకాశముంది.
* రేబిస్ వ్యాధి సోకిన వ్యక్తి వెలుతురును చూసినా. గాలి వీచినా. నీళ్లను చూసినా భయపడవచ్చు.
* ఎక్కువమంది నీళ్లను చూసి భయపడతారు. దీన్నే హైడ్రోఫోబియా అంటారు.
* రేబిస్ అంటు వ్యాధి. వ్యాధి సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర కళ్లలో లేదా నోట్లో పడినా రేబిస్ ఎదుటి వ్యక్తికి సోకుతుంది.
* రేబిస్ రోగి వద్ద ఉన్న సహాయకులు కూడా ప్రొఫలాక్సిస్ డోస్ వేసుకోవాలి.
* నరాల బలహీనత వస్తుంది. బాగా అసహనంతో ఉంటారు. కండరాల నొప్పులు తదితర లక్షణాలు
కనిపిస్తాయి. 



పెంపుడు కుక్క కరిచినా ముప్పే 

కుక్కల్లో రేబిస్ క్రిములు ఉంటాయని, పెంపుడు కుక్క అయినాసరే కరిచినప్పుడు రేబిస్ సోకే ప్రమాదముందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల రాజమండ్రి మున్సిపల్ కాలనీకి చెందిన మంగం లక్ష్మీబాయి (60), బుధవారం పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కాల్దరికి చెందిన కవురు సుబ్బారావు (40)లు పెంపుడు కుక్కలు కరవడం వల్లే రేబిస్ సోకి మరణించారు. సాధారణంగా రేబిస్ సోకిన కుక్క 15 రోజుల్లో మృతి చెందుతుంది.

గతంలో కరిచిన కుక్క చనిపోతే రేబిస్ సోకే ప్రమాదముందని భయపడి బాధితులు బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేయించుకునేవారు. కాని నేడు పరిస్థితి తారుమారైంది. కరిచిన కుక్క నెలల తరబడి బాగానే ఉన్నప్పటికీ అది కరవడంతో రేబిస్ వ్యాధి సోకిన వ్యక్తులు మాత్రం చనిపోతున్నారు. దీనిని బట్టి పిచ్చికుక్కల్లోనే కాదు, మామూలుగా ఉండే పెంపుడు కుక్కల్లోనూ రేబిస్ క్రిములు ఉంటాయని తెలుస్తోంది.



సాక్షి సౌజన్యంతో... )

Sunday, May 01, 2011

మన దేహం దెయ్యమా...?

మనది దెయ్యాల దేహం..
మన దేహంలో అణువణువూ దెయ్యాలే
కళ్లు, కాళ్లు, చెవులు, ముక్కు, నోరు.. ప్రతిదీ దెయ్యం ప్రతిరూపమే..
మీ పొట్టి, పొడవులకు కారణం దెయ్యాలే
రంగు, స్వరూపానికీ కారణం అవే..
సంతోషం, దుఃఖం, కోపం, ఆనందం...
ఇవి కూడా దెయ్యాల నుంచి వచ్చినవే..
మీ విజయానికి కారణం దెయ్యాలే..
మీ పరాజయానికీ బాధ్యత వాటిదే..
పరీక్షల్లో పాసైనా.. ఫెయిలనా..
తప్పు మీది కాదు.. దెయ్యాలదే..
మీ ప్రస్తుత పరిస్థితికి... మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు.. కారణం ఆ దెయ్యాలే...

ఇంతకూ ఈ దెయ్యాల గోలేంటి..?

మన శరీరంలోని కొన్ని భాగాలు.. మన తల్లిదండ్రుల భాగాలను పోలి ఉంటాయి.. మన ముక్కు.. మన అమ్మ ముక్కును పోలి ఉండొచ్చు.. మన నడక.. మన తాత నడకను గుర్తుకు తేవచ్చు.. మనలో కొన్ని శరీర భాగాలు లేదా లక్షణాలు.. మన పూర్వీకుల నుంచి సంక్రమిస్తాయని తెలుసు.. అయితే.. మన పూర్వీకులకు సంబంధించిన అన్ని లక్షణాలు యధాతథంగా ఒక తరం నుంచి మరో తరానికి రాకపోవచ్చు.. ఉదాహరణకు.. మన తల్లిలోని అన్ని లక్షణాలు మనకు రాకపోవచ్చు.. కానీ తల్లిలోని కొన్ని అంశాలు మాత్రం తప్పకుండా మనలో కనిపిస్తాయి.. అందుకే.. కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు.. అచ్చం తల్లిపోలికే అని.. లేదా తండ్రి పోలికే అనే మాటలు వినిపిస్తుంటాయి..

అసలు.. లక్షణాలు ఎలా వస్తాయి..? ఎందుకు వస్తాయి..?

జీవశాస్త్ర భాషలో చెప్పాలంటే.. ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే లక్షణాలను అనువంశిక లక్షణాలు అంటాం.. జన్యువుల ద్వారా ఈ అనువంశిక లక్షణాలు పిల్లలకు సంక్రమిస్తాయి.. మనలో ఏదైనా లక్షణం మన పూర్వీకులను పోలి ఉంది అంటే.. దానికి కారణం జన్యువులే.. కానీ జన్యువులలో కూడా అప్పుడప్పుడు మార్పులు జరుగుతుంటాయి.. ఇలాంటి వాటిని ఉత్పరివర్తనాలు అంటాం.. అందువల్లే.. మనలోని అన్ని లక్షణాలు మన తల్లిదండ్రులను పోలి ఉండవు. అయితే.. మన లోని ప్రతి అంశం.. మన పూర్వీకుల నుంచి సంక్రమించిందే అని నిర్ధారణ అయింది.

మరి దెయ్యాలకు, ఈ లక్షణాలకు ఉన్న సంబంధమేంటి..?

తల్లిదండ్రుల నుంచి వచ్చిన కొన్ని జన్యువులు.. పిల్లల్లో కొన్ని లక్షణాలు లేదా వ్యాధులకు కారణమవుతాయని పరిశోధనలో తేలింది. తల్లిదండ్రులలోని కొన్ని లక్షణాలు యధాతథంగా పిల్లలకు సంక్రమిస్తున్నాయి. దీన్నే జన్యు ముద్రగా నిర్ధారించారు. అదేవిధంగా.. జన్యువును కొన్ని రసాయన చర్యలకు గురిచేయడం ద్వారా వేర్వేరు ఫలితాలను గుర్తించారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే జన్యువులలో ఏదేని జన్యువు లోపించినా... లేక ఒక జన్యువు ఎక్కువగా వచ్చినా పిల్లల్లో విపరీత లక్షణాలు వస్తున్నాయి.

వంశపారంపర్యంగా వచ్చే కొన్ని వ్యాధులకు కూడా జన్యువులే కారణం. స్థూలకాయం, బట్టతల లాంటి అనేకం ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అలాగే.. క్రోమోజోముల్లో మార్పులు చేయడం ద్వారా అవసరానికి తగ్గట్లు శరీరాన్ని పెంచుకోవచ్చు.. తగ్గించుకోవచ్చు..

తల్లిదండ్రులలోనో.. తాతముత్తాతలకో జరిగిన ఓ మార్పు.. ఆ తర్వాతి తరాలకు సంక్రమిస్తే.. అలాంటివాటిని ట్రాన్స్‌ జెనరేషనల్‌ ఎఫెక్ట్స్‌ అంటారు.. తాతముత్తాతల తిండి మనమళ్లు,మనవరాళ్ల జీవితకాలంపై నేరుగా ప్రభావం చూపుతోందని పరిశోధనలు చెబుతున్నాయి.  కొంతమంది పిల్లల్లో తాతలకున్న డయాబిటీస్‌ వ్యాధి సంక్రమించింది.

తల్లిదండ్రుల ఆహారం, వారి వ్యాధులు, వాడిన మందులు.. తదితరవాటి ప్రభావం.. వారి పిల్లలపై స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు.. మన లైఫ్‌ స్టెయిల్ కూడా మన పిల్లలు, వారి పిల్లలపై ఇంపాక్ట్‌ చూపిస్తోంది. ఆల్కహాల్‌ సేవించడం, డ్రగ్స్‌ తీసుకోవడం, పొగతాగడం లాంటి దురలవాట్లతోపాటు.. ఎక్సర్‌సైజ్‌, పనిలో ఒత్తిడి లాంటి అంశాలు కూడా భావితరాలకు సంక్రమిస్తున్నాయి..

అంటే.. మనలోని ప్రతి లక్షణం మన పూర్వీకుల నుంచే వచ్చింది. అయితే.. వాళ్లెవరూ ఇప్పుడు మనతో లేరు. చనిపోయారు. అయినా.. వారిలోని ఏదో ఒక లక్షణం లేదా స్వభావం మన తల్లిదండ్రుల ద్వారా మనకు, మన ద్వారా మన భవిష్యత్ తరాలకు సంక్రమిస్తోంది.. చనిపోయినవారు దెయ్యాలై తిరుగుతుంటారని మనం భావిస్తుంటాం. అందుకే.. మన దేహం ఓ దెయ్యం.. ఇంకా వివరంగా చెప్పాలంటే.. మన దేహం దెయ్యాల సమూహం..