Monday, July 11, 2011

నేడో రేపో తెలంగాణ..!!

     తెలంగాణపై ప్రకటన చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాన్ని వీలయినంత త్వరగా చక్కదిద్దాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందులోభాగంగానే వారం, పది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కీలక ప్రకటన చేసేందుకు ఆ పార్టీ సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే మూడు ప్రత్యామ్నాయాలను కూడా హైకమాండ్ రెడీ చేసినట్లు సమాచారం..

ఆప్షన్ 1: నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణను ప్రకటించడం

ఆప్షన్ 2: నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేస్తూ.. హైదరాబాద్ పై విస్తృతంగా చర్చించడం

ఆప్షన్ 3: రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయడం

ప్రస్తుతం ఈ మూడు ప్రత్యామ్నాయాలను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తయారుచేసినట్లు విశ్వసనీయ సమాచారం. వీటిపై ఇటు తెలంగాణవాదులు, అటు సమైక్యవాదుల అభిప్రాయాలను సేకరించి.. ఏదో ఒకదానిపై ఏకాభిప్రాయం సాధించి దాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.. 

ఈ ఆప్షన్స్ తో సమస్య సద్దుమణిగేనా..?
     ఈ మూడు ఆప్షన్స్ ను ఓ సారి పరిశీలిస్తే కొంతమేర సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చని అర్థమవుతుంది..

ఆప్షన్ 1: నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణను ప్రకటించడం..:
     ఈ ఆప్షన్ అమలు చేసేందుకు సమైక్యవాదుల నుంచి వ్యతిరేకత రావడం సహజం.. ప్రస్తుతం యధాతథంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేందుకు సమైక్యవాదులు అంగీకరించకపోవచ్చు.. కొంతకాలం ఇలాగే కొనసాగించినా.. ఆ తర్వాత తెలంగాణ విడిపోవడానికి వారి నుంచి సానుకూలత వస్తుందని ఆశించలేం..

ఆప్షన్ 2:  నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేస్తూ.. హైదరాబాద్ పై విస్తృతంగా చర్చించడం
     ఇది కొంతమేర ఏకాభిప్రాయ సాధనకు వీలయిన ఆప్షన్ గా కనిపిస్తోంది.. నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణ ఏర్పాటును ప్రకటిస్తే.. తెలంగాణ వాదుల నుంచి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు.. అయితే.. హైదరాబాద్ లేని తెలంగాణను అంగీకరించేందుకు తెలంగాణవాదులు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించరు. అదే సమయంలో హైదరాబాద్ పైనే ప్రస్తుతం సమైక్యవాదుల నుంచి పేచీ ఎదురవుతోందన్న విషయం తెలిసిందే..! అందుకే.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రకటిస్తూ.. హైదరాబాద్ పై విస్తృతంగా చర్చించేందుకు సిద్ధమవడం ఇరుప్రాంతాలవారికీ కొంత సానుకూల పరిణామంగానే భావించవచ్చు.. విస్తృత చర్చల తర్వాత హైదరాబాద్ పై తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా ఇరుప్రాంతవాసులూ కట్టుబడి ఉంటే ఆ తర్వాత సమస్య ఉండకపోవచ్చు..

ఆప్షన్ 3: రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయడం..
     రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయడం అంటే.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును చెత్తకుప్పలో వేయడమే.. ఈ ఆప్షన్ కు సమైక్యవాదులు అంగీకరించినా.. తెలంగాణవాదులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. కాబట్టి ఆప్షన్ కు అవకాశమే లేదని అర్థమవుతుంది..

కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నిర్ణయమేదైనా.. త్వరగా తీసుకుంటే ఇరుప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది.. ఈ ఆప్షన్స్ పైనైనా ఇరుప్రాంత నాయకులూ ఏకాభిప్రాయానికి రావాలని ఆశిద్దాం...

Thursday, July 07, 2011

దొంగల ముఠా కేంద్రం - DMK

ఎ. రాజా..
కనిమొళి
దయానిధి మారన్..

దొంగల ముఠా కేంద్రం (DMK)లో ప్రధాన సభ్యులు.. UPA ప్రభుత్వంలో ఎన్నో భాగస్వామ్య పక్షాలున్నాయి. ఆయా పార్టీలకు చెందిన మంత్రులెంతోమంది కేబినెట్ లో ఉన్నారు. అయితే.. ఎవరిపైనా లేనన్ని.. రానన్ని ఆరోపణలు కేవలం DMK సభ్యులపైన మాత్రమే రావడం ఆలోచించాల్సిన విషయం.. దేశాన్ని దోచుకోవాలనే పక్కా ప్లాన్ తోనే DMK... UPA ప్రభుత్వంలో చేరినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వంలో చేరినది మొదలు వీరంతా.. సొంత వ్యవహారలను.. సొంత రాష్ట్ర ప్రయోజనాలను చక్కదిద్దుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. కనీసం తమిళనాడుకు ఎంతో కొంత మేలు జరిగినా బాగుండేది.. కానీ వీళ్లంతా.. సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేశారు.

2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఇప్పటికే దొంగల ముఠా కేంద్రం (DMK) అధ్యక్షుడు కరుణానిధి పార్టీకి చెందిన రాజా ఊచలు లెక్కబెడుతున్నారు. ఇక.. కూతురు కనిమొళి కూడా తీహార్ జైల్లో అల్లికలు నేర్చుకుంటూ పుస్తకాలు చదువుకుంటోంది.. ఇప్పుడు మనవడు దయానిధి మారన్ వంతు వచ్చింది. నేడో రేపో దయానిధి మారన్ కూడా తీహార్ జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. పాపం ఈ వయసులో ముసలాయను ఎన్ని కష్టాలు వచ్చాయో..!

కుటుంబ రాజకీయాలు ఎంత ప్రమాదకరమో DMKను చూసి అర్థం చేసుకోవచ్చు.. కరుణానిధి నియంతృత్వ ధోరణి వల్లే.. కుటుంబసభ్యులకు తప్ప మరెవరికీ ఆ పార్టీలో అగ్రస్థానం దక్కలేదు. సొంత మనుషులు కావడంతో.. కరుణానిధి కూడా చూసీచూడనట్లు వ్యవహరించారు. చివరకు ఆ అలసత్వమే ఆయన కొంపముంచింది. రాజాను మందలిస్తే.. కనిమొళి ఏమనుకుంటుందోనని భయం.. ఎందుకంటే.. రాజాకు, కనిమొళికి మధ్య అంతటి సన్నిహిత సంబంధాలున్నాయి మరి..!

ఇక దయానిధి మారన్ మనవడైపోయాడు.. తమిళనాడులో దయానిధి మారన్ కు చెందిన సన్ నెట్ వర్క్ ప్రభావం అంతాఇంతా కాదు. దీంతో.. ఓ సారి తన్ని తరిమేసినా.. మళ్లీ దరిచేర్చుకున్నాడు. ఇక ఓ కుమారుడి ( స్టాలిన్)కు తమిళనాడు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాడు. దీంతో.. ఇంకో కుమారుడు (అళగిరి) ఏమనుకుంటాడోనని తనను ఏకంగా కేంద్ర మంత్రి పదవి ఇప్పించాడు.. ఇదీ దొంగలముఠా కేంద్రం కుటుంబ పాలన..!

మొత్తానికి ఇంటిదొంగలు తిన్న ఇంటి వాసాలు లెక్కపెడుతున్నా... మీడియా కోడై కూసేంతవరకూ ప్రధాని మన్మోహన్ సింగ్ పట్టించుకోకపోవడం బాధాకరం. అయనా.. ఆయన చేతిలో ఏముందిలే! వీళ్లను బయటకు పంపిస్తే.. తన సీటుకే ఎసరు వస్తుందేమోనని ఆయన భయం..!

ఇంటిపనులు చక్కదిద్దుకోలేక కరుణానిధి చచ్చిపోతుంటే... మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, కరుణానిధి పాపాల చిట్టా బయటకు తీస్తోంది. కరుణానిధి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికితీస్తోంది. అవి కూడా బయటకు వస్తే.. పాపం ఈ దొంగలముఠా అంతా కలిసి తీహార్ జైల్లో ఒకరు జేబులు మరొకరు కొట్టుకుని బతకాలేమో..?