
గాంధీభవన్లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి పదవీస్వీకారం సందర్భంగా జరిగిన సమావేశంలో.. కేవీపీ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. గాంధీభవన్లో వై.ఎస్.ఫోటో లేకపోవడం ఆయన అభిమానులందరినీ కలచివేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వై.ఎస్.పై కాంగ్రెస్ నేతలు గతంలో చాలాసార్లు విమర్శలు చేసినా.. ఏనాడూ ఆయన ఆత్మబంధువు కేవీపీ నోరు తెరవలేదు.! కానీ వై.ఎస్.ను విమర్శిస్తూ.. పార్టీపై అతని ముద్రను చెరిపేయాలనుకుంటున్న కాంగ్రెస్ కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని కేవీపీ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే బహిరంగంగానే.. సాక్షాత్తూ సీఎం సాక్షిగా వై.ఎస్.ఫోటోపై కేవీపీ నిలదీశారు..

ఏదేమైనా... కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న పలువురు నేతలు 2013 మధ్యనాటికి జగన్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. ఎవరినిపడితే వారిని పార్టీలోకి స్వాగతించేందుకు కూడా జగన్ సిద్ధంగా లేనట్లు ఆయన సన్నిహితుల సమాచారం.. ప్రధానంగా వై.ఎస్.ను, తనను బాగా విమర్శించినవారినే మొదట పార్టీలో చేర్చుకోవాలని జగన్ భావిస్తున్నారట! తిట్టిన నోళ్ల నుంచే.. పొగిడించుకోవాలనేది ఇక్కడ యువనేత వ్యూహంగా కనిపిస్తోంది..!!