Sunday, January 01, 2012

కాంగ్రెస్ లో కలిసిపోనున్న జగన్ పార్టీ..!?


    2014 ఎన్నికల్లోగా కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని జగన్ విలీనం చేయబోతున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఈరోజు ప్రధాన కథనాన్ని ప్రచురించింది. విశ్వసనీయ వర్గాలు ఈ మేరకు సమాచారం అందించినట్లు అందులో పేర్కొన్నారు.

     2010 నవంబర్ 18వ తేదీన జగన్ ఢిల్లీకి వెళ్లారు. ఆ పర్యటనలో కాంగ్రెస్ అధిష్టానానికి, జగన్ కు మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరిందని ఆ కథనం పేర్కొంది. ఇద్దరు ఎంపీలు జగన్ కు, కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య సంధానకర్తలుగా వ్యవహరించారని తెలిపింది. గాలి జనార్ధన్ రెడ్డి లాంటి పరిస్థితి తనకు రాకుండా ఉండేందుకు జగన్ ఈ ప్రతిపాదన చేశారని.. ఇందుకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా అంగీకరించిందని పేర్కొంది.. దీనికి సంబంధించి కాంగ్రెస్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోయినా... ప్రాథమికంగా ఓకే చెప్పినట్లు సమాచారం.

     సీబీఐ కేసులో తనను అరెస్టు చేయకూడదని.. కేసు విచారణ వేగాన్ని తగ్గించాలని జగన్ షరతు పెట్టినట్లు సమాచారం. అలాగే పార్టీ విలీనం తర్వాత రాష్ట్రంలో తనకు ప్రధాన హోదా ఇవ్వాలని.. అలాగే చిరంజీవిని రాష్ట్ర రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది. 2014లోపు తెలుగుదేశం పార్టీని పూర్తిగా బలహీనపర్చాలనే ఉమ్మడి అంగీకారానికి అటు కాంగ్రెస్, ఇటు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లు వ్యూహరచన చేశాయి. 2014లో రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కృషి చేయాలని నిర్దేశించుకున్నాయి.

    జగన్ తో కుదిరిన ఒప్పందం మేరకే... చిరంజీవికి కేంద్ర మంత్రిపదవి వరించనుంది. అలాగే సీబీఐ కేసు వేగం కూడా నెమ్మదించింది. అంతేకాక జగన్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత సోనియాపై విమర్శలు మానేసి.. తెలుగుదేశం పార్టీనే టార్గెట్ గా చేసుకున్నారు. అడపాదడపా టీడీపీ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తోంది. ఢిల్లీలో జగన్ కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నారని.. అందుకే సోనియాపై ఇప్పుడు నోరెత్తడం లేదని విమర్శిస్తోంది..

     మరి ఈ ఒప్పందం ఎంతమేరకు వాస్తవమో తెలియాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే..! ప్రేమే లక్ష్యం-సేవే మార్గం అంటూ పుట్టుకొచ్చిన ప్రజారాజ్యం పార్టీ కనీసం మూడేళ్లు కూడా గడవకముందే చేతులెత్తేసి.. షేక్ హ్యాండిచ్చింది. ఇప్పుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే మార్గంలో పయనించేటట్లు కనిపిస్తోంది. ఇదే జరిగితే.. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్, టీడీపీల మధ్యే ప్రధాన పోరు ఉండే అవకాశం ఉంది...

Note: Times of Indiaలో వచ్చిన కథనాన్ని చూడాలనుకుంటే.. ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయవచ్చు.
http://timesofindia.indiatimes.com/city/hyderabad/Jagans-olive-branch-to-Cong/articleshow/11323109.cms

2 comments:

Anonymous said...

జగన్ పార్టీ పెట్టిన రోజు అనుకున్న మాట యిది.

Anonymous said...

Third rated news papers Times Of India..Jagan was in Guntur from Nov 16 to Dec 2..How come he was in Delhi..

Yellow media and journalism at it's lowest standards..

http://www.sakshi.com/main/Fullstory.aspx?catid=295684&Categoryid=1&subcatid=33