Tuesday, July 22, 2014

మారండి బాబూ....!!

బాబు మారరు..!!


రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో 3 జిల్లాలకు చంద్రబాబు వరాలు ప్రకటించారు బాగానే ఉంది. మరి కడప జిల్లాను ఎందుకు అనాధగా వదిలేశారు? ఇది ప్రతిపక్షనేత జగన్ జిల్లా కాబట్టి వదిలేశారా..? కడప జిల్లా వై.ఎస్. కుటుంబానికి కంచుకోట కాబట్టి ఇక్కడేమీ పెట్టకూడదనుకుంటున్నారా..? కడపకు ఏం తక్కువ..? దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలను కనెక్ట్ చేసే రైల్వే లైన్ ఉంది. బ్రిటీష్ కాలం నాటి ఏర్ పోర్ట్ ఉంది. అత్యాధునిక హంగులతో ఏర్పడిన యోగి వేమన యూనివర్సిటీ ఉంది. పెన్నా నది ఒడ్డునే కడప నగరం ఉండడంతో తాగునీటికి సమస్య ఉండదు.. తెలుగుదేశం పార్టీ ఫేస్ బుక్ పేజీలోని ఈ ఇమేజ్ చూసిన తర్వాత అర్థమైంది ఒక్కటే.. కడపను వాంటెడ్ గానే నిర్లక్ష్యం చేస్తున్నారని! 

     వై.ఎస్.కు, చంద్రబాబుకు తేడా ఇక్కడే కనపడుతుంది. వై.ఎస్. తాను ఎక్కడ బలహీనంగా ఉన్నారో అక్కడ బలపడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు.. చంద్రబాబు చిత్తూరు జిల్లావాసి అయినా నాడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడానికి కారణం వై.ఎస్. అనుసరించిన ఎత్తుగడలే..! అంతెందుకు.. నేడు జగన్ పార్టీ కూడా చిత్తూరులో సత్తా చాటింది..! కానీ చంద్రబాబు పార్టీ కడపలో తరాలుగా చతికిలపడుతూనే ఉంది.. ఇందుకు కారణం చంద్రబాబు కడపపై పెద్దగా దృష్టి పెట్టకపోవడమే.. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడపపై ఓ చూపు చూసి ఉంటే.. వై.ఎస్. హవాకు చెక్ పెట్టి ఉండొచ్చు. కానీ చంద్రబాబు ఎప్పుడూ అలాంటి పని చేయలేదు. 

     కడప అంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే.. కనీసం ఇప్పుడైనా తాను మారానని చెప్పుకుంటున్న చంద్రబాబు కడపపై కాస్త దృష్టి పెడతారని ఆశించాను. కడపలో పాగా వేసేందుకు జిల్లాపై వరాల వర్షం కురిపిస్తారని ఆశించాను. వై.ఎస్. కంటే చంద్రబాబే నయం.. జిల్లాకు మేలు చేశారు అని.. ప్రజలు కొనియాడేలా పేరు తెచ్చుకుంటారని భావించాను.. ఒక్క తిరుపతికే అన్ని విద్యాసంస్థలు కేటాయించకపోతే అందులో ఒకదాన్ని కడపలో పెడితే బాగుంటుంది కదా..? కోస్తా జిల్లాలన్నిటినీ కారిడార్ పేరుతో కలిపేస్తున్నారు. సీమలోని నాలుగింటిలో మూడు చోట్ల విద్యాసంస్థలు కేటాయించారు.. అంటే ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో ఒక్క కడప జిల్లాయే అనాథ! 

     ఇది దారుణం.. అన్యాయం.. గర్హనీయం.. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను..! ఈ పోస్టు చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే... ఆయన మారలేదు.. ఆయన మారనంత వరకూ కడప జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీ పట్ల మనసు మార్చుకోరు..! ఇది వాస్తవం..!! కాస్త మేల్కోండి చంద్రబాబు గారూ..! ఎక్కడ వీక్ గా ఉన్నారో.. అక్కడ స్ట్రాంగ్ అయ్యేందుకు ట్రై చేయండి..!!

1 comment:

Unknown said...

వైఎస్ ఉన్నంత కాలం కడపకు చేసిందేమీ లేదు. పైసా ప్రయోజనం కూడా కలగలేదు. ఐఐఐటి ఒక్కటి తప్ప... అక్కడ ఏమీ చేయలేదు. కడప కడుపు నిండిందంటూ అప్పట్లో హంగామానే జరిగింది. ఇన్నేళ్లు అధికారంలో ఉన్న వైఎస్సే అక్కడ ఏమీ చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు ఏదైనా చేస్తాడనుకోవడం మన అమాయకత్వమే అవుతుంది. ఒక వేళ పొరపాటున తర్వాతి టర్మ్ జగన్ వచ్చినా.. ఆ కడపను పట్టించుకోరు. బ్రాహ్మణి అన్నారు.. అది బకాసురల చేతిలో బలైపోయింది. సెయిల్ అన్నారు.. అది ఎప్పుడో మునిగిపోయింది. చివరకు కడప కడుపు ఎప్పటికీ నిండదని మరోసారి తేలిపోయింది. అన్నా అందరూ గడప దాటుతారే.. కానీ దాన్ని పట్టించుకునే వారే ఉండరు.