Saturday, December 08, 2012

సోనియా, చంద్రబాబు క్విడ్ ప్రో కో...!!

     రాజ్యసభలో ఎఫ్ డీ ఐ లపై ఓటింగ్ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు గైర్వాజరు కావడం సంచలనం కలిగిస్తోంది. కానీ తమ ఓటింగ్ నిర్ణయాత్మకం కానందున గైర్హాజరైనా పెద్ద సమస్య లేదని ఆ పార్టీ ఎంపీలు చెబుతున్నారు.. వారన్నట్టు వారి ఓటుతో వచ్చే నష్టమేమీ లేదనుకుందాం... కానీ ఎఫ్ డీ ఐ లకు తాము పూర్తిగా వ్యతిరేకమని చెప్పుకొచ్చిన తెలుగుదేశం పార్టీ.. పెద్దఎత్తున ర్యాలీలు, ధర్నాలు కూడా చేపట్టింది. విపక్షాలన్నీ ఉమ్మడిగా చేసిన భారత్ బంద్ లో కూడా ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి.. అంతెందుకు? ఎఫ్ డి ఐ లపై జరిగిన చర్చలో కూడా ఆ పార్టీ నేతలు గొంతు చించుకున్నారు.. మరి ఎందుకు ఇలాంటి పని చేశారు?


మరి ఎందుకు గైర్హాజరు?
శుక్రవారం వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వ్యతిరేకమంటూ ఊదరగొట్టిన ఆ పార్టీ నేతలు ఓటింగ్ సమయంలో గైర్హాజరు కావడం ఆ పార్టీ శ్రేణులను నిశ్చేష్ఠులను చేసింది. ఒకరు గైరాహాజరైతే ఏదో కారణం ఉండొచ్చులే అనుకోవచ్చు. కానీ కీలకసమయంలో ఒకేసారి ముగ్గురు డుమ్మా కొట్టడం ఆషామాషీ విషయం కాదు. ఇప్పుడు అందరి అనుమానం ఏంటంటే.. చంద్రబాబుకు తెలిసే వీళ్లు గైర్హాజరయ్యారా అని..!! ఎందుకంటే.. పార్టీ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న అంశంపై చర్చ జరుగుతున్నపుడు అంత అలసత్వం ప్రదర్శించారంటే ఎవరికీ నమ్మబుద్ధి కాదు..!! పైగా.. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న సుజనా చౌదరి, దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు ఇంత పని చేశారంటే ఎవ్వరూ నమ్మరు..

చంద్రబాబుకు తెలిసే చేశారా..?
డాక్టర్ అపాయింట్ మెంట్ ఉండడం వల్ల చంద్రబాబుకు చెప్పే సభకు వెళ్లలేదని దేవేందర్ గౌడ్ చెప్తున్నారు. తలనొప్పిగా ఉండడం వల్ల ట్యాబ్లెట్ తెచ్చుకోవడానికి వెళ్లి వచ్చేసరికి సమయం మించిపోయిందని సుజనాచౌదరి  చెప్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్లే వెళ్లలేకపోయానని గుండు సుధారాణి చెప్పారు. వీళ్లు చెప్పిన కారణాలు చూస్తే.. స్కూల్ కు ఎగ్గొట్టిన పిల్లాడు చెబుతున్న కారణాలలాగా అనిపిస్తాయి. అంతేకాని లక్షలాది మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న, బాధ్యత గల ప్రజాప్రతినిధిగా చెప్తున్న కారణాలుగా అనిపించవు. తమ ఓటు నిర్ణయాత్మకం కానందువల్ల గైర్హాజరైనా పెద్ద నష్టమేమీలేదని దేవేందర్ గౌడ్ సమర్థించుకుంటున్నారు. 'మీ ఓటు నిర్ణయాత్మకం కాకపోవచ్చు.. కానీ మీ పార్టీకి ఒక విధానం ఉంది. ఆ విధానాన్ని మీరంతా గౌరవించాలికదా..!! అంతసేపూ సభలోనే ఉన్న మీరు ఓటింగ్ సమయంలో మాత్రమే బయటకు వెళ్లిపోవడంపై ఎలా అర్థం చేసుకోవాలి?'.

ఎంపీల వివరణలన్నీ విన్న తర్వాత సామాన్యుడికి కూడా ఓ విషయం స్పష్ఠంగా అర్థమవుతుంది.. దీని వెనుక ఏదో ఉందని..!! అది చంద్రబాబుకు తెలియకుండా జరిగిందనుకుంటే పొరపాటే..!! అత్యంత అనుంగులుగా పేరొందిన ఈ ఎంపీలు బాబుకు చెప్పకుండా ఏ పనీ చేయరు..!! అందుకే ఇప్పుడు బాబును అనుమానించాల్సి వస్తోంది..

చంద్రబాబుకు ఏంటి లాభం?
ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ఎవరికీ తెలియనివి కావు.. కాంగ్రెస్, తెలుగుదేశం పరిస్థితులు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఈ రెండు పార్టీల నేతలకు వలవేసి లాగేస్తున్నాయి. పైగా జగన్ కు సానుభూతి, కేసీఆర్ కు ఉద్యమం బలమైన ఆయుధాలుగా ఉన్నాయి. వీరిద్దరికీ చెక్ చెప్పేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు బహిరంగంగా కాకపోయినా అంతర్గతంగా సహకరించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందులో భాగంగానే టీడీపీ ఎంపీల గైర్హాజరయ్యారని అర్థం చేసుకోవచ్చు. డబ్బుకోసం తమ ఎంపీలను చంద్రబాబు ఓటింగ్ కు దూరంగా ఉంచారని అనుకోలేం..!! అంత నీచమైన స్థితికి చంద్రబాబు దిగజారారని ఊహించలేం..!! కానీ భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కాంగ్రెస్ కు సహకరించారనుకోవచ్చు.! క్విడ్ ప్రో కో సూత్రాన్ని గుర్తుకు తెచ్చుకుని ఉండొచ్చు..! 2014లో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ మద్దతివ్వచ్చేమో..!! ఏమో చెప్పలేం...!! రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరు కదా..!! ఏదైనా సాధ్యమే...!!

1 comment:

Jai Gottimukkala said...

అఖిల పక్ష భేటీ వాయిదా వేయడం ద్వారా తెలంగాణాను అడ్డుకోవాలనే కుట్రలో భాగంగా కిరణ్, బాబు, జగన్ ముగ్గురూ కలిసి ఆడుతున్న డ్రామా ఇది.