Wednesday, November 24, 2010

రోశయ్య రాజీనామా

     కాంగ్రెస్ మార్క్ అంటే ఏంటో మరోసారి తెలిసింది. ఎప్పుడు ఎవరిని పదవిలో నుంచి తొలగిస్తుందో.. ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తుందో కాంగ్రెస్ పార్టీకే తెలియదు. అలాంటిదే రోశయ్య రాజీనామా కూడా..!
    14 నెలల 22రోజుల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన రోశయ్య అధిష్టానం ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించారు. పాలనలో తనదైన మార్కు వేయకపోయినా.. అధిష్టానం దృష్టిలో మాత్రం పెద్దాయనగానే మిగిలిపోయారు. వయోభారం, పని ఒత్తిడి భరించలేకే రాజీనామా చేస్తున్నానని రోశయ్య చెప్పినా.. పాపం పెద్దాయన వల్ల రాష్ట్ర పరిపాలన సరిగా సాగడం లేదని అధిష్టానం గ్రహించింది.
     రాజీనామా చేస్తా.. మీరే పరిపాలించుకుంటారా అని పుట్టపర్తిలో అని 24 గంటలు గడవక ముందే రోశయ్య రాజీనామా చేశారు. రాజీనామా వాక్కులను పుట్టపర్తి సాయిబాబా దీవించినట్లున్నారు. లేకుంటే రోశయ్య ఇప్పటికిప్పుడు దిగిపోతారని ఎవరైనా ఊహించారా..?
     సాక్షిలో సోనియా, మన్మోహన్ లపై వ్యతిరేక కథనాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జగన్ ను కంట్రోల్ లో పెట్టాలని నిర్ణయానికొచ్చిన అధిష్టానం ముందుగా.. అతడి అనుచరగణంపై దృష్టిపెట్టనుంది. అందులోభాగంగానే సీఎం మార్పు.! సీఎంను మార్చడం ద్వారా కొత్త మంత్రివర్గానికి అవకాశం కలుగుతుంది. ఈసారి జగన్ వర్గీయులెవరికీ కేబినెట్లో స్థానం దక్కకపోవడం ఖాయం. ఇది జగన్ కు పెద్ద షాకే.! ఇలా తనకు అవకాశమున్న ప్రతిదారినీ మూసేయాలని అధిష్టానం భావిస్తోంది. జగన్ పై ఇప్పటికిప్పుడు వేటు పడకపోయినా.. తన అనుచరగణంపై మాత్రం అధిష్టానం కొరడా ఝళిపించబోతోంది.
     సీఎల్పీ భేటీలో జగన్ వర్గీయులు తప్పకుండా నిరసన తెలియజేస్తారేమోనని భావించిన ప్రణబ్ ముఖర్జీ.. చాలా తెలివిగా పని కానిచ్చేశారు. నేరుగా సోనియా సందేశాన్ని చదవి వినిపించి.. కొత్త నేత ఎంపిక బాధ్యతను సోనియాకు కట్టబెడుతూ తీర్మానాన్ని పకడ్బందీగా ఆమోదింపజేసుకున్నారు. ఇదే జగన్ వర్గానికి తొలి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఇక రాష్ట్రంలో కొత్త సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ ను ఆటాడుకోవడం ఖాయం..

No comments: